వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం

  • వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోటా 70 శాతానికి పెంపు
  • ఇరాన్ యుద్ధంతో దిగుమతులకు అంతరాయం.. కొరత నివారణకు చర్యలు
  • ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాలకు ప్రాధాన్యం
  • అదనపు కోటా కోసం పీఎన్‌జీకి రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన
  • ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతి.. త్వరలో తగ్గనున్న సంక్షోభం
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర పరిశ్రమలకు కూడా ఈ రంగాలు మద్దతుగా నిలుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 50 శాతం కేటాయింపులకు అదనంగా మరో 20 శాతం సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అయితే, ఈ అదనపు 20 శాతం కోటా పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వద్ద పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రత్యేక ఉష్ణప్రయోజనాల కోసం ఎల్పీజీని వాడే పరిశ్రమలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో వివరించారు. సిలిండర్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు చూసుకుంటాయని తెలిపింది.

ఇదిలా ఉంటే... హ‌ర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే మరిన్ని భారతీయ ఎల్పీజీ నౌకలకు అనుమతి ఇచ్చేందుకు ఇరాన్ సానుకూలంగా స్పందించింది. ఈ విషయమై భారత అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో త్వరలో గ్యాస్ సరఫరా సంక్షోభం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

Commercial LPG
Central Government
LPG quota
Iran war
Gas shortage
Steel industry
Automobile industry
Textile industry
City Gas Distribution
Piped Natural Gas

More Telugu News